PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 8:48 pm Posted by : PRABHATHA SURYUDU

Nala Encroachment: ఏఎంఆర్ లెగసీ వెంచర్‌లో వివాదం

ఏఎంఆర్ లెగసీ వెంచర్‌లో ముదురుతున్న నాలా కబ్జా లొల్లి

  • ఇరిగేషన్ శాఖ మార్కింగ్‌పై కొత్త సందేహాలు
  • సహజ ప్రవాహాన్ని పక్కనబెట్టి కొత్త మార్గం చూపుతున్నారంటూ ఆరోపణలు
  •  ‘అసలు నాలా ఎక్కడ..?’ అంటూ గ్రామస్తుల ప్రశ్నలు

అబ్దుల్లాపూర్‌మెట్ – ప్రభాత సూర్యుడు

గౌరెల్లి గ్రామ పరిధిలోని ఏఎంఆర్ లెగసీ రియల్ వెంచర్‌లో నాలా కబ్జా వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇటీవల నాలా పూడ్చివేసి విల్లా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన ఇరిగేషన్ శాఖ ఏఎంఆర్ లెగసీ రియల్ సంస్థ యాజమాన్యానికి గత శుక్రవారం నోటీసులు జారీ చేయగా, సోమవారం ఏఈఈ శ్రీవాణి ఆధ్వర్యంలో అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు. టోపో షీట్ ఆధారంగా నాలా పరివాహక ప్రాంతాన్ని గుర్తించి మార్కింగ్ చేపట్టిన అధికారులు, నాలా మార్గంలో వేసిన మట్టిని జేసీబీల సహాయంతో తొలగించారు.

జెసిబిల సహాయంతో కబ్జాకు గురైన నాలా పూడికతీతలు

ఇరిగేషన్ శాఖ అనుమతులు, సూచనలకు అనుగుణంగానే నిర్మాణాలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. అయితే అధికారుల చర్యలపై స్థానిక గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న సహజ నాలా ప్రవాహాన్ని పక్కనబెట్టి కొత్తగా మరో మార్గాన్ని నాలాగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అసలు నాలా మార్గాన్ని కాకుండా కొత్త లైన్‌ను మార్కింగ్ చేయడం వెనుక కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు.

ఎమ్మార్ లెగసి రియల్ సంస్థ సిబ్బందికి నోటీసులు అందిస్తున్న ఇరిగేషన్ అధికారులు

మరోవైపు అధికారులు మాత్రం ప్రభుత్వ రికార్డులు, టోపో షీట్లు, సాంకేతిక ఆధారాల ప్రకారమే మార్కింగ్ చేపట్టామని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తుల ఆరోపణలు, అధికారుల వివరణలతో నాలా వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.