PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 6:03 pm Posted by : PRABHATHA SURYUDU

బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం ప్రారంభం

  • 300 మంది ప్రతినిధులతో ఘనంగా ప్రారంభమైన బీజేపీ దీన్‌దయాళ్ ప్రశిక్షణ శిబిరం
  • కార్యకర్తలే పార్టీ బలం.. రంగారెడ్డిలో బీజేపీ రెండ్రోజుల శిక్షణ శిబిరం ప్రారంభం

హైదరాబాద్, ప్రభాత సూర్యుడు

రంగారెడ్డి అర్బన్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం శుక్రవారం బండ్లగూడ నాగోల్‌లోని శ్రేయస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది. జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణ శిబిరంలో సుమారు 300 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

మే 30, 31 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరంలో పార్టీ సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ చరిత్ర మరియు వికాసం, దేశం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ సవాళ్లు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, సోషల్ మీడియా వినియోగం తదితర అంశాలపై కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహా సంఘటన మంత్రి చంద్రశేఖర్ తివారి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. శిక్షణ శిబిరాల ద్వారా పార్టీ బలోపేతానికి అవసరమైన నైపుణ్యాలు, అవగాహన పెంపొందుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సహా సంఘటన మంత్రి శివ ప్రకాశ్ జీ, శిబిర ప్రముఖ్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు, సామ రంగారెడ్డి, రవికుమార్ యాదవ్, రాష్ట్ర మరియు జిల్లా పదాధికారులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శిక్షణ శిబిరం ద్వారా పార్టీ భావజాలాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు