PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 10:38 pm Posted by : PRABHATHA SURYUDU

ఉప్పల్‌కు రూ.1,511 కోట్ల అభివృద్ధి వరాలు.. శంకుస్థాపనలు చేసిన సీఎం రేవంత్

ఉప్పల్‌కు రూ.1,511 కోట్ల అభివృద్ధి వరాలు.. శంకుస్థాపనలు చేసిన సీఎం రేవంత్

హైదరాబాద్, ప్రభాత సూర్యుడు

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉప్పల్ పరిధిలో రూ.1,511 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్టు చేశారు.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.98 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన కార్పొరేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా రూ.960 కోట్లతో ఏఓసీ సెంటర్ పరిధిలో ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం, రూ.416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం రూ.37.50 కోట్ల వ్యయంతో 100 పడకల మల్కాజిగిరి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు.

అలాగే ప్రజా సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ‘క్యూర్ వన్’ (CURE One) యాప్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఉప్పల్ భగాయత్‌లో వంజరి కుల ఆత్మగౌరవ భవనాన్ని కూడా ప్రారంభించినట్లు సీఎం తన పోస్టులో పేర్కొన్నారు.