Date of Publish : 27 July 2026, 7:04 amPosted by : PRABHATHA SURYUDU
ఆగస్టు 10 జైల్ భరోను విజయవంతం చేయాలి
ఆగస్టు 10 జైల్ భరోను విజయవంతం చేయాలి
నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలి: పగడాల యాదయ్య
అబ్దుల్లాపూర్మెట్ – ప్రభాత సూర్యుడు:
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఆగస్టు 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య పిలుపునిచ్చారు. అబ్దుల్లాపూర్మెట్ మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, కార్మికుల హక్కులను హరించే విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రామిక వర్గాలు ఐక్యంగా పోరాడితేనే కార్మిక హక్కులను కాపాడుకోగలమని, అందుకే ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమంలో కార్మికులు, శ్రామికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, కార్మికుల ఐక్య పోరాటంతోనే ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గించగలమని అన్నారు. ఈ సమావేశంలో గుండె శివకుమార్, బాలరాజు, శ్రీశైలం, ముత్యాలు, భిక్షపతి, జంగయ్య తదితర సీపీఎం నాయకులు పాల్గొన్నారు.