PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 8:05 am Posted by : PRABHATHA SURYUDU

నేటి నుంచే మృగశిర కార్తె.. తొలకరి వానలకు ప్రకృతి సిద్ధం

నేటి నుంచే మృగశిర కార్తె.. తొలకరి వానలకు ప్రకృతి సిద్ధం

హైదరాబాద్, ప్రభాత సూర్యుడు:

వేసవి తీవ్రత తగ్గి వర్షాకాలానికి నాంది పలికే మృగశిర కార్తె నేటి నుంచి ప్రారంభమైంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యుడు రోహిణి నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్ని మృగశిర కార్తెగా పరిగణిస్తారు. మృగశిర కార్తె ప్రారంభంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటూ ఆకాశం మేఘావృతమై తొలకరి చినుకులు పడే అవకాశాలు పెరుగుతాయి. ఈ కాలాన్ని రైతులు అత్యంత కీలక దశగా భావిస్తారు. పొలాల దుక్కి దున్నడం, విత్తనాల సిద్ధం వంటి వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు.

ఈ ఏడాది రోహిణి కార్తె మే 25న ప్రారంభమై జూన్ 8న ముగియగా, అదే రోజున మృగశిర కార్తె ఆరంభమైంది. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం తొలి వారంలో తేలికపాటి వర్షాలు, అనంతరం వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయానికి అనుకూలమైన ఈ కాలంలో కురిసే తొలకరి వర్షాలు పంటల మొలకెత్తుదలకు దోహదపడతాయని రైతులు విశ్వసిస్తున్నారు. తదుపరి దశగా జూన్ 23 నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం కానుండగా, అప్పటికి వర్షాలు మరింత విస్తరించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.