Date of Publish : 27 July 2026, 6:47 amPosted by : PRABHATHA SURYUDU
24 గంటల్లో పరారైన నిందితుడి అరెస్ట్
24 గంటల్లో పరారైన నిందితుడి అరెస్ట్
చాకచక్యంగా పట్టుకున్న సిద్దిపేట పోలీసులు
సిద్దిపేట – ప్రభాత సూర్యుడు:
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోలీసుల కన్నుగప్పి పరారైన నిందితుడిని కేవలం 24 గంటల్లోనే సిద్దిపేట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, జూలై 25న సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిందితుడిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో పోలీసు వ్యాన్లో ఉండగా చేతులకు వేసిన సంకెళ్లను తొలగించుకుని అత్యవసర ద్వారం (ఎమర్జెన్సీ డోర్) ద్వారా బయటకు దూకి సమీపంలోని సందు మార్గంలో పరారయ్యాడు. అనంతరం కోమటిచెరువు కట్టపై పార్క్ చేసి ఉన్న ఓ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
సమాచారం అందుకున్న వెంటనే సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. సీసీటీవీ ఫుటేజ్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఆధారాల సహాయంతో నిందితుడి కదలికలను గుర్తించిన పోలీసులు, ఆదివారం మధ్యాహ్నం కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పరారైన నిందితుడిని 24 గంటల్లోనే గుర్తించి అరెస్టు చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు. విధి నిర్వహణలో పోలీసులు చూపిన సమయస్ఫూర్తి, సమన్వయం, నిబద్ధత ప్రశంసనీయమని ఆమె పేర్కొన్నారు.