సిద్దిపేటలో జూలై 29న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
40 ఏళ్లు పైబడిన మహిళలు తప్పక వినియోగించుకోవాలి: హరీష్ రావు
సిద్దిపేట – ప్రభాత సూర్యుడు:
మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా హైదరాబాద్కు చెందిన సింధూ క్యాన్సర్ హాస్పిటల్స్ సహకారంతో ఈ నెల 29వ తేదీ (బుధవారం) సిద్దిపేట బైపాస్ రోడ్డులోని విపంచి కళానిలయంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు.. ముందస్తుగా గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి” అన్నారు. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా, స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. ప్రత్యేకంగా 40 ఏళ్లు పైబడిన ప్రతి మహిళ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని, కుటుంబ సభ్యులు కూడా వారిని ప్రోత్సహించాలని కోరారు.
గర్భాశయ, రొమ్ము క్యాన్సర్లను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఉన్నాయని, ముందస్తు పరీక్షలతో వాటిని నివారించవచ్చని వివరించారు. హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను సిద్దిపేటలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నామని హరీష్ రావు తెలిపారు. గతంలో నిర్వహించిన శిబిరాల ద్వారా పలువురిలో క్యాన్సర్ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించగలిగామని గుర్తు చేశారు. ఈ శిబిరం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. అవసరాన్ని బట్టి పాప్ స్మియర్ టెస్ట్, మామోగ్రామ్, రక్త పరీక్షలు, ఎక్స్రే తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు. “ముందస్తు వైద్య పరీక్ష.. మీ ఆరోగ్యానికి రక్ష” అనే సందేశంతో మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.