PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 8:06 pm Posted by : PRABHATHA SURYUDU

తెలంగాణను ప్రపంచానికే గేట్‌వేగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రభాత సూర్యుడు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికే గేట్‌వేగా నిలబెట్టడమే తమ లక్ష్యమని, “తెలంగాణ రైజింగ్-2047” దార్శనికతతో రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

రైతుల కోసం రూ.2 లక్షల వరకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, యువతకు 67,763 ఉద్యోగాల భర్తీ వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు.

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి సర్వీసెస్ హబ్‌గా అభివృద్ధి చేయడంతో పాటు ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, చెరువుల పరిరక్షణ, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రజల సహకారం, ఆశీర్వాదం అవసరమని ముఖ్యమంత్రి కోరారు.