PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 12:28 pm Posted by : PRABHATHA SURYUDU

TG SIR: తెలంగాణలో 70 లక్షల ఓట్లు పోయినట్లే ?

తెలంగాణలో 70 లక్షల ఓట్లు పోయే ప్రమాదం?.. ఓటర్లకు కీలక హెచ్చరిక

హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు:

తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) డిజిటలైజేషన్ ప్రక్రియ గడువు ముగిసే సమయానికి పూర్తి కాకపోతే లక్షలాది ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డిజిటలైజేషన్ ప్రక్రియ 77.86 శాతం మాత్రమే పూర్తయినట్లు సమాచారం.

మరో నాలుగు రోజులే గడువు

రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, గురువారం సాయంత్రం వరకు 2,63,37,790 మంది ఓటర్ల వివరాలను మాత్రమే బీఎల్‌వోలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండగా, మధ్యలో సెలవులు ఉండటంతో ప్రక్రియ పూర్తి చేయడం సవాలుగా మారింది. నిర్ణీత గడువులోపు నమోదు పూర్తి చేయకపోతే సంబంధిత ఓట్లను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్‌లోనే అత్యధిక ప్రభావం

హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో డిజిటలైజేషన్ శాతం తక్కువగా ఉండటంతో గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ప్రక్రియ పూర్తైంది.

ఇప్పటికే మరణించినవారు, చిరునామా మారినవారు, వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓట్లు కలిపి సుమారు 56 లక్షల ఓట్లు గుర్తించినట్లు సమాచారం. అలాగే గుర్తింపు పత్రాల ధృవీకరణ పూర్తికాని మరికొంతమంది ఓటర్ల వివరాలపైనా పరిశీలన కొనసాగుతోంది.

గమనిక: ప్రస్తుతం సోషల్ మీడియాలో, పలు మీడియా వర్గాల్లో ప్రచారంలో ఉన్న సమాచారం ఆధారంగా ఈ కథనం రూపొందించబడింది. ఓట్ల తొలగింపుపై తుది నిర్ణయం భారత ఎన్నికల సంఘం నిబంధనలు, ధృవీకరణ ప్రక్రియల ఆధారంగా ఉంటుంది.

  • For Related Link :

For Our More News Click Here: https://www.telangana.gov.in/