PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 9:13 pm Posted by : PRABHATHA SURYUDU

పని చేస్తే చేయండి..లేకపోతే వెళ్లిపోండి

హైడ్రా సిబ్బందిపై రంగనాథ్ వ్యాఖ్యలు కలకలం

జీతాల పెంపు కోరిన ఉద్యోగులకు ఘాటు సమాధానం?

హైడ్రా కమిషనర్ తీరుపై సిబ్బందిలో అసంతృప్తి

హైదరాబాద్, ప్రభాత సూర్యుడు:

హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. జలవిహార్‌లో జరిగిన సమావేశంలో జీతాల పెంపు అంశాన్ని ప్రస్తావించిన ఉద్యోగులకు ఆయన ఘాటుగా స్పందించినట్లు సమాచారం. సమావేశంలో ఓ ఉద్యోగి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెలకు రూ.22 వేల వేతనం లభించేదని, ప్రస్తుతం కేవలం రూ.17 వేలు మాత్రమే అందుతున్నాయని పేర్కొంటూ వేతనాలు పెంచాలని కోరినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన రంగనాథ్, “పని చేస్తే చేయండి.. లేకపోతే వెళ్లిపోండి” అంటూ సమాధానం ఇచ్చినట్లు సిబ్బంది వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, “బయట ఉద్యోగాలు లేవు.. ఈ ఉద్యోగం కూడా వదిలేస్తే ఇబ్బందులు పడతారు” అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. https://www.telangana.gov.in/

అలాగే ఎన్నికల ముందు జీతాల పెంపు జరిగే అవకాశం ఉంటుందని, అప్పటి వరకు ఆశలు పెట్టుకోవద్దని చెప్పినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. హైడ్రా వాహనాలు అందుబాటులో లేకపోయినా సొంత వాహనాల్లో పరికరాలు తీసుకుని విధులకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇంకా, విధులకు సమయానికి హాజరుకాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, రెండు సార్లకు మించి ఆలస్యమైతే ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలపై హైడ్రా సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎండా, వానా లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న తమతో ఇలా మాట్లాడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగనాథ్ వైఖరితో ఇప్పటికే కొందరు ఉద్యోగాలు వీడినట్లు కూడా సిబ్బంది వర్గాలు చెబుతున్నాయి.

For More Updates: https://prabhathasuryudu.com/illegal-abortion-center-busted-in-nagole-two-arrested/

గమనిక: పై ఆరోపణలు సిబ్బంది వర్గాల నుంచి వచ్చినవే. ఈ అంశంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.