వినాయకుడితో రూ.45 వేల కోట్ల మార్కెట్..
భక్తితోపాటు భారీ వ్యాపారం
వినాయక చవితి అంటే భక్తి, ఆధ్యాత్మికత మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వ్యాపారానికి కూడా వేదికగా మారుతోంది. గణేశ్ ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల గణేశ్ మండపాలు ఏర్పాటు అవుతున్నట్లు సమాచారం.
మండపాల ఏర్పాటు, అలంకరణలు, పూజా సామగ్రి కోసం సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చవుతున్నట్లు అంచనా. ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలో దాదాపు రూ.5 వేల కోట్ల వ్యయం జరుగుతున్నట్లు సీఏఐటీ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
వినాయక చవితి సందర్భంగా ఆహారం, స్వీట్లు, మోదకాల విక్రయాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ విభాగంలో సుమారు రూ.2,400 కోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా.
అలాగే గణేశుడికి సమర్పించే బంగారం, వెండి తదితర వస్తువులకు కూడా భారీగా డిమాండ్ ఉంటోంది. ఈ విభాగంలో సుమారు రూ.1,000 కోట్ల మేర డిమాండ్ ఉన్నట్లు నివేదిక పేర్కొంటోంది.
మొత్తంగా వినాయక చవితి ఉత్సవాల చుట్టూ దేశవ్యాప్తంగా దాదాపు రూ.45 వేల కోట్ల మార్కెట్ ఏర్పడినట్లు సీఏఐటీ నివేదిక వెల్లడించినట్లు సమాచారం. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే వినాయక చవితి.. అదే సమయంలో చిన్న వ్యాపారుల నుంచి ఈవెంట్ మేనేజ్మెంట్, స్వీట్లు, పూజా సామగ్రి, అలంకరణలు, బంగారం-వెండి వరకు అనేక రంగాలకు భారీ ఆర్థిక అవకాశాలను కల్పిస్తోంది.

