బండ్లగూడ ఇందు ఆరణ్య అపార్ట్మెంట్స్లో ‘మీ సురక్ష’ అవగాహన
హైదరాబాద్, ప్రభాత సూర్యుడు
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో ఉన్న ఇందు ఆరణ్య అపార్ట్మెంట్స్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో “మీ సురక్ష” కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు పి. శివనాగ ప్రసాద్, పి. దశరథ్, పోలీసు సిబ్బంది మరియు బీట్ కానిస్టేబుల్-2 సిబ్బంది పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైన పోలీసు అధికారి మగ్బుల్ జాని అపార్ట్మెంట్ నివాసితులను ఉద్దేశించి ప్రసంగించారు. “మీ సురక్ష” కార్యక్రమం ద్వారా పౌరుల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో నమోదు ప్రక్రియ, నివాసితుల ధృవీకరణ విధానం, అత్యవసర సేవల వినియోగం, మహిళలు మరియు పిల్లల భద్రత, సైబర్ నేరాల నివారణ, పోలీసు సహాయక సేవలు, అత్యవసర హెల్ప్లైన్ నంబర్ల ప్రాధాన్యతపై వివరించారు.

సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం ఎవరికీ పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ప్రజల భాగస్వామ్యంతోనే సమాజంలో శాంతిభద్రతలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్న అధికారులు, తమ ప్రాంత భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

