“తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే..” పవన్ కల్యాణ్కు పొన్నం ప్రభాకర్ కౌంటర్
హైదరాబాద్, ప్రభాత సూర్యుడు:
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. “తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే” అంటూ పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, పవన్ కల్యాణ్ మరోసారి తన అహంకారాన్ని ప్రదర్శించారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లోనే తనకు దిక్కులేదని పవన్ స్వయంగా అంగీకరించారని వ్యాఖ్యానించారు.
తెలుగు రాష్ట్రాలు రాజకీయంగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. అయితే తెలంగాణ నవ నిర్మాణం పేరుతో రాష్ట్రంలో రాజకీయ సభలు నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ బీఆర్ఎస్ లేదా బీజేపీ ఎంగేజ్ చేసుకున్న ఆర్టిస్టులా వ్యవహరిస్తున్నారని, ఆయనకు సరైన స్క్రిప్ట్ కూడా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణలో సభ నిర్వహిస్తామని ప్రకటించడం సరికాదని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నప్పటికీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు.
అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కల్యాణ్ ఎప్పుడైనా రాష్ట్రానికి మద్దతు ఇచ్చారా..? అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచారా..? అని ప్రశ్నించారు.

