హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు
గుర్రంగూడ అటవీ ప్రాంతంలో నిర్వహించనున్న వనమహోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ, ఇది కేవలం మొక్కలు నాటే కార్యక్రమం మాత్రమే కాదని, గతంలో జరిగిన పర్యావరణ విధ్వంసం, వరదల అనుభవాల నుంచి తీసుకున్న సంకల్పానికి ప్రతీక అని పేర్కొన్నారు. గత పాలనలో చెరువుల కబ్జాలు, అటవీ భూముల ఆక్రమణల కారణంగా హైదరాబాద్ నగరం చిన్న వర్షానికే అతలాకుతలమయ్యేదని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం చెరువుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ, అటవీ భూముల రక్షణ కోసం న్యాయపోరాటం చేస్తూ పర్యావరణ హిత నగర నిర్మాణానికి కృషి చేస్తోందన్నారు. https://tgpcb.cgg.gov.in/
2021లో గుర్రంగూడ ప్రాంతంలో వరదల సమయంలో మల్కాజ్గిరి ఎంపీగా పర్యటించినప్పుడు కలిగిన ఆవేదన నుంచే ఈ ఆలోచన పుట్టిందని, ఇప్పుడు అదే ప్రాంతంలో వనమహోత్సవం నిర్వహించడం ద్వారా ఆ సంకల్పాన్ని కార్యరూపం దాల్చిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కబ్జాదారులపై చర్యలు తీసుకుని అటవీ భూములను రక్షించిందని, హైదరాబాద్ను పచ్చదనంతో నిండిన పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. https://prabhathasuryudu.com/samantha-meets-tamil-nadu-chief-minister-vijay/

