R&B ఇంజినీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులు
హైదరాబాద్, ప్రభాత సూర్యుడు:
రోడ్లు & భవనాల శాఖ (R&B) ఇంజినీర్-ఇన్-చీఫ్ (ENC) మోహన్ నాయక్ నివాసాలు, కార్యాలయాలు మరియు ఆయనకు సంబంధించిన ఇతర ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచి విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్లోని ఆయన నివాసంతో పాటు మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. మోహన్ నాయక్ అక్రమాస్తులు కూడబెట్టారనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

సోదాల్లో భాగంగా బంగారు బిస్కెట్లు, భారీ మొత్తంలో నగదు, వెండి వస్తువులు, విలువైన బంగారు ఆభరణాలు లభ్యమైనట్లు సమాచారం. వీటి విలువ కోట్ల రూపాయల్లో ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మోహన్ నాయక్పై గత కొంతకాలంగా కాంట్రాక్టుల కేటాయింపుల్లో అక్రమాలు, కమీషన్ల వసూళ్లు, టెండర్ నిబంధనల ఉల్లంఘన వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్లు, వంతెనలు, ఇతర నిర్మాణ పనుల కాంట్రాక్టుల విషయంలో భారీగా కమీషన్లు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన అక్రమాస్తుల విలువ రూ.100 కోట్లకు పైగా ఉండొచ్చని తెలుస్తోంది. అయితే అధికారిక లెక్కలు సోదాలు పూర్తయిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో ఆస్తులు ఉండటంతో వాటి విలువను అంచనా వేయడానికి సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలను అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

