కోహెడ అంతర్జాతీయ మార్కెట్ నిర్మాణ పనుల పరిశీలన
రంగారెడ్డి – ప్రభాత సూర్యుడు
కోహెడలో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ (IAS), మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి తదితరులతో కలిసి మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులు నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించి, పలు సూచనలు చేశారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ, రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ మాట్లాడుతూ, రాబోయే 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతికతతో ఈ మార్కెట్ను నిర్మిస్తున్నామని చెప్పారు.

కార్యక్రమంలో పలు శాఖల ఉన్నతాధికారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

