- 400 మంది లబ్ధిదారులకు రూ.4 కోట్లకు పైగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
అబ్దుల్లాపూర్మెట్ – ప్రభాత సూర్యుడు
ప్రజా పాలనలో పేద కుటుంబాల ఆడపడుచులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలానికి చెందిన 400 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద రూ.4,00,46,400 విలువైన చెక్కులను గురువారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదని తెలిపారు.

ప్రతి పేదింటి మహిళకు, ఆడపడుచులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీవాణి, ఇతర అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

