రూ.45 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో రాధిక
టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న స్థానికులు
మహబూబాబాద్, ప్రభాత సూర్యుడు:
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల ఎంపీడీవో రాధిక లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడంతో స్థానికులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మండల కార్యాలయం వద్ద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
వెంచర్ అనుమతికి సంబంధించి ఓ వ్యక్తి నుంచి రూ.45 వేల లంచం డిమాండ్ చేసిన ఎంపీడీవో రాధిక, ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో ఎంపీఓతో పాటు, వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఎంపీడీవో కుమారుడిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఎంపీడీవోపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఏసీబీ చర్యలతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని, ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

