రూ.50 వేల జరిమానా విధించిన హైకోర్టు.. చెల్లించిన తర్వాతే అఫిడవిట్ స్వీకరించాలని ఆదేశం
హైదరాబాద్, ప్రభాత సూర్యుడు:
హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్కు తెలంగాణ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, ఆయనపై రూ.50 వేల జరిమానా విధించింది. హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ మండలం యూసుఫ్గూడ పరిధిలోని సర్వే నంబర్ 45 (హనుమాన్ టెంపుల్ వెనుక) ఉన్న భూమికి సంబంధించి కోర్టు స్టేటస్ కో ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ, హైడ్రా అధికారులు అక్కడ కాంపౌండ్ వాల్ కూల్చివేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు బోర్డు ఏర్పాటు చేసినట్లు పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని గతంలో పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ, హైడ్రా కమిషనర్ తరఫున సమయానికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదని కోర్టు గుర్తించింది. అంతేకాకుండా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా భావించిన న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో కమిషనర్ రంగనాథ్పై రూ.50 వేల జరిమానా విధిస్తూ, ఆ మొత్తం చెల్లించిన తర్వాత మాత్రమే కౌంటర్ అఫిడవిట్ను స్వీకరించాలని హైకోర్టు రిజిస్ట్రీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామం హైడ్రా వ్యవహారంపై మరోసారి చర్చకు దారితీసింది.

