న్యూఢిల్లీ – ప్రభాత సూర్యుడు
దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆంక్షలు విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జూన్ 22 వరకు టెలిగ్రామ్ సేవలను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జూన్ 21న జరగనున్న NEET-UG 2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో ప్రశ్నపత్రాల లీక్లు, తప్పుడు సమాచారం, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. టెలిగ్రామ్ ద్వారా కొందరు అక్రమ గుంపులు పరీక్షా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. http://www.nta.ac.in/
ఎందుకు నిషేధం?
కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద ఈ ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల పారదర్శకతను కాపాడటం, మోసాలను అరికట్టడమే ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా టెలిగ్రామ్లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం.
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడి స్పందన
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ డురోవ్ ఈ నిర్ణయంపై స్పందిస్తూ, కొందరి తప్పిదాల కారణంగా కోట్లాది మంది సాధారణ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అక్రమ కార్యకలాపాలు ఇతర యాప్లకు మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో చర్చ
మరోవైపు ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు పరీక్షల భద్రత కోసం తీసుకున్న సరైన నిర్ణయమని మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఇది అతిగా తీసుకున్న చర్య అని విమర్శిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ నిషేధం పూర్తిగా తాత్కాలికమని, జూన్ 22 తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
https://prabhathasuryudu.com/supreme-court-warning-on-rti-misuse/

