HCU Land : కేటీఆర్ పేల్చిన పొలిటికల్ ల్యాండ్మైన్ కు తల పట్టుకుంటున్న ఆ 6గురు యంపిలు
గచ్చిబౌలి 400 ఎకరాల భూవివాదంలో ఎవరా ఎంపీ ?
.jpg)
గచ్చిబౌలి HCU వివాదంలో ఎవరా ఎంపీ ?
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
తెలంగాణలో కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం HCU ఆధీనంలో ఉన్నట్టుగా చెబుతున్న 400 ఎకరాల భూమిని గ్యారంటీగా పెట్టి ICICI బ్యాంక్ నుంచి ప్రభుత్వం గతేడాది 10వేల కోట్ల రుణం తీసుకుంది. అయితే 30 వేల కోట్లకు పైగా విలువ చేసే ఈ భూములను సెక్యూరిటీగా పెట్టి కేవలం 10వేల కోట్ల రుణం తీసుకోవడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడిరదట. వీటి వేలం ద్వారా దాదాపు 30 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశముండటంతో అభివృద్ధి పనులు ప్రారంభించింది. ఇక్కడే మ్యాటర్ సీరియస్ టర్న్ తీసుకుంది.. భూయాజమాన్య హక్కుల విషయంలో HCU, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వివాదం చినికిచినికి గాలివానగా మారి సుప్రీంకోర్టు దాక వెళ్లింది.. ఇదో పెద్ద స్కామ్ అంటూమరింత దుమారం రేపుతోంది. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఓ బీజేపీ ఎంపీకి ఈ భూముల వ్యవహారంతో సంబంధం ఉందనే కేటీఆర్ వ్యాఖ్యలతో కమలం పార్టీలో కలవరం మొదలైందని తెలుస్తోంది.
మొత్తం 8 మంది ఎంపీలు ఉండగా, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మిగిలిన ఆరుగురు ఎంపీల్లో ఎవరి ప్రమేయం ఇందులో ఉందనే డౌట్ బీజేపీలో డిబేట్ పాయింట్గా మారిందని తెలుస్తోంది. ఆ ఆరుగురు ఎంపీల వైపు మిగతా రాజకీయ పార్టీలతో పాటు సామాన్య జనం సైతం అనుమానంగా చూస్తున్నారట. 170 కోట్ల రూపాయల కవిూషన్ కొట్టేసింది ఈయనంటే ఈయనంటు రాజకీయవర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోందట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలతో బీజేపీ ఎంపీలు తెగ ఇబ్బంది పడిపోతున్నారట. ఆ బీజేపీ ఎంపీ ఎవరో చెప్పేస్తే బావుండేదని, సస్పెన్స్తో జనమంతా తమను అనుమానంగా చూస్తున్నారని వాపోతున్నారట బీజేపీ ఎంపీలు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని సదరు ఎంపీలు మాట్లాడుకుంటున్నట్లు టాక్. కేటీఆర్ ఆ ఎంపీ పేరు బైటపెట్టే వరకు నిందను అందరూ మోయాల్సిందేనా అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారంట. ఐతే ఈ సస్పెన్స్ కంటిన్యూ అవుతుందా? కేటీఆర్ ఆ ఎంపీ ఎవరో చెప్పేస్తారా? లేదంటే పొగబెట్టే రాజకీయంలో భాగంగా కేటీఆర్ ఆ కామెంట్స్ చేశారా అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందేనేమో.