Telangana Politics : రేవంత్ సర్కార్ ఉంటుందో.. ఊడుతదో.. ?
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు

రాయపర్తి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు
రేవంత్ సర్కార్ ఉంటుందో.. ఊడుతదో.. ?
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు
వరంగల్ - ప్రభాత సూర్యుడు
అబద్ధాల పునాదులపై నిర్మితమైన రేవంత్రెడ్డి సర్కార్ ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళన నడుమ ఊగిసలాడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎద్దేవా చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అసత్యపు హావిూలు, ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను నమ్మించి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ సర్కార్ 16 నెలలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాలతో ఛీత్కరింపులకు గురవుతున్నదని ఆరోపించారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారుడో... ప్రభుత్వం కూలుడో తప్పక జరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు.
సమావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
తెలంగాణ రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షకు మేరకు పురుడుపోసుకున్న గులాబీజెండా, కేసీఆర్ నాయకత్వమే రాష్టాన్రికి శ్రీరామరక్ష అని తెలిపారు. పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 27న హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి గులాబీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు, తెలంగాణవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. రేవంత్రెడ్డి సర్కార్ అనతి కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని, రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు పెడితే అబాసుపాలవుతామన్న భావనతోనే ప్రభుత్వం సాహసం చేయడంలేదని మండిపడ్డారు. ఉద్యమ రథసారధి కేసీఆర్ తలపెట్టిన రజతోత్సవ సభలో ఏం అద్భుతాలు జరుగుతాయో.., గులాబీ బాస్ ఏం ప్రసంగిస్తాడోనని ప్రపంచమంతా ఎల్కతుర్తి సభ వైపే ఉరకలేత్తే ఉత్సాహంతో ఎదురు చూస్తున్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పలువురు పాల్గొన్నారు.