TG Chief Secretary : తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు ?
Who Will Be Next CS For Telangana | Who is the new CS of Telangana 2025
తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు
- ప్రస్తుత సీఎస్ లో కనిపించని సీరియస్ నెస్
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
పరిపాలనా పెద్దగా ఉన్న చీఫ్ సెక్రెటరీ సీరియస్గా ఉంటే కార్యదర్శి మొదలు కలెక్టర్ వరకు చిత్తశుద్ధితో పనిచేసేవారని, కానీ ఏడాది కాలంగా శాంతికుమారి పనితీరును పరిశీలిస్తే అలాంటి అభిప్రాయం కలగడం లేదన్నది ఆ చర్చల్లోని కీలకమైన అంశం. సీఎం ఆలోచనలకు, వేగానికి తగ్గట్టుగా పాలనా యంత్రాంగాన్ని నడిపించడంలో చీఫ్ సెక్రెటరీ తనదైన ముద్ర వేసుకోలేకపోయారన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఐఏఎస్ ఆఫీసర్లలోనూ సీరియస్నెస్ లేకపోవడంతోనే ప్రభుత్వం విమర్శలపాలు కావడానికి మొయిన్ రీజన్గా చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వం మారినప్పుడు.. సహజంగానే చీఫ్ సెక్రెటరీని మార్చే సంప్రదాయం ఉంటుంది. సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఆమెపై ఎంతో నమ్మకంతో అదే బాధ్యతల్లో కొనసాగించారని, చివరకు ఆర్థిక ఇబ్బందుల మధ్యే స్కీంల లబ్ధిని ప్రజలకు అందిస్తున్నా.. విమర్శలు రావడం సెక్రెటేరియట్లోని ఉన్నతధికారుల్లో చర్చకు దారి తీసింది.ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాల్సిన అధికార యంత్రాంగాన్ని నడిపించాల్సిన సీఎస్ విమర్శలకు తావులేని తీరులో వ్యవహరించాల్సి ఉంటుందని, కానీ ముఖ్యమంత్రి, క్యాబినెట్ స్థాయిలో తీసుకునే నిర్ణయాల అమలులోనూ లోపాలు జరగడాన్ని ఎత్తిచూపుతున్నారు. పాలనా వ్యవస్థలో అలసత్వం, నిర్లక్ష్యం పేరుకుపోయిందన్న చర్చ నడుస్తోంది. అధికార యంత్రాంగానికి అధిపతిగా ఉండే సీఎస్ మొదలు వివిధ శాఖల్లోని కార్యదర్శులు, కలెక్టర్ స్థాయి వరకు విధుల పట్ల సీరియస్గా లేరేనే విమర్శలు వస్తున్నాయి.చీఫ్ సెక్రటరీ ఎవరినీ కలవరు.. చొరవ తీసుకొని కలవడానికి వచ్చిన కార్యదర్శులు, శాఖాధిపతులకు టైం ఇవ్వరు అనే విమర్శలు సచివాలయంలో బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇటీవల ఢల్లీి పర్యటనలో ఓ రోజు అదనంగా ఉంటే ఎవరికి చెప్పావు.. ఎందుకున్నావ్ అంటూ చీఫ్ సెక్రటరీ మందలించిన విషయం పలువురు ఐఏఎస్ల మధ్య చర్చకు దారితీసింది. సీఎం సూచనలతోనే ఢల్లీిలో ఉన్నా అంటూ ఆయన బదులివ్వడంతో నొచ్చుకున్నారని కూడా వారి మధ్య గుసగుసలకు కారణమైంది. గతంలో రుణమాఫీ విషయంలో, తాజాగా గ్రామసభల్లో రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వరకు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆయా శాఖల అధికారులను, కలెక్టర్లను గైడ్ చేసి పనిచేయించుకోవడంలో ఆమె పనితీరుపై పలువురు అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి.కొన్ని శాఖల్లో అధికారులు మంత్రులకు కూడా వివరాలను ఇవ్వడంలేదనే విమర్శలు ఉన్నాయి. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఒక మంత్రి ఇటీవల ఈ శాఖ నుంచి తప్పుకోవడమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారట. అడిగిన సమాచారాన్ని తన శాఖ అధికారులు ఇవ్వడమేలేదని ఓ మహిళా మంత్రి ఇటీవల వాపోయారట. చీఫ్ సెక్రెటరీ దృష్టికి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ద్వారా, సీఎంఓ అధికారుల ద్వారా తీసుకెళ్ళినా ఫలితం లేదని సైలెంట్ అయిపోయారన్న చర్చ జరిగింది.ప్రభుత్వ ఉద్దేశాలకు, లక్ష్యానికి అనుగుణంగా అధికారులను నడిపించాల్సిన సీఎస్.. సీఎం ఆదేశాలను నిరంతరం ఫాలో అప్ చేయడంలో పలువురు ఐఏఎస్లు ఆమెను వేలెత్తి చూపుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక వివిధ శాఖల కార్యదర్శులకు చీఫ్ సెక్రెటరీకి మధ్య గ్యాప్ ఉన్నట్లు.. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఆ శాఖలతో ఫాలో అప్ సవిూక్షలు మొక్కుబడిగా జరుగుతున్నాయినేది మరో ఆరోపణ.ఇందుకు కొన్ని ఉదాహరణలనూ సెక్రెటేరియట్లోని ఆఫీసర్లు, కింద శ్రేణిలో ఉన్న సిబ్బంది ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సంక్షేమ హాస్టళ్లను బ్యూరోక్రాట్లు సందర్శించాలని, రాత్రి నిద్ర చేసి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను చూపాలని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా అమల్లోకి రాలేదనేది ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఒకరిద్దరు కలెక్టర్లు తప్ప సీఎం ఆదేశాలను పట్టించుకున్న అధికారులే లేరట. ఒకటికి రెండు సార్లు సీఎం స్వయంగా బ్యూరోక్రాట్లకు గుర్తు చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.ఆ తర్వాత ఫలితం అంతంత మాత్రమే. ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రతిపక్షాలకు ఇది ప్రచారాస్త్రంగా మారినట్లు సమాచారం. ఉన్నత స్థాయి సవిూక్షల్లో, జిల్లా సదస్సుల్లో, కలెక్టర్ల సమావేశాల్లో ముఖ్యమంత్రి చెప్పినా దాన్ని అమలు చేయించడంలో సీఎస్ సీరియస్గా ఉంటే పరిస్థితి ఈ స్థాయికి చేరుకునేది కాదన్నది వారి అభిప్రాయం.
సీఎస్కు, సెక్రెటరీలకు మధ్య చోటుచేసుకున్న సమస్వయలేమి చివరకు కలెక్టర్కు, సచివాలయానికి మధ్య కూడా కొనసాగుతున్నదనే ఆరోపణలూ వస్తున్నాయి. కేంద్ర మంత్రి ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఓ కలెక్టర్ వ్యవహరించిన తీరుపై రాష్ట్ర మంత్రి మందలించటం వైరల్ అయింది గానీ.. అక్కడ జరిగిన లోపాలు, నిర్లక్ష్యంపై సీఎస్ తీసుకున్న క్రమశిక్షణా చర్యల్లేవన్న అంశాన్ని పలువురు బ్యూరోక్రాట్లు ప్రస్తావించారు.చాలా డిపార్టుమెంట్లలో ఇదే తరహా నిస్తేజం, స్తబ్ధత నెలకొన్నదని, చీఫ్ సెక్రెటరీ సీరియస్గా ఉంటే క్షేత్రస్థాయిలో పనులు లోపాల్లేకుండా సజావుగా జరిగేవని, గ్రామసభల్లో పొరపాట్లకు ఆస్కారం ఉండేది కాదని, ఇది లోపించడంతోనే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి చాన్స్ ఇచ్చినట్లయిందన్నది వారి భావన. ఇప్పుడు సీఎస్ పనితీరుపై ఇటు అధికారులు, ప్రజల్లోనూ చర్చలు జరుగుతున్నాయి
రేసులోముగ్గురు
తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు అనేదానిపై ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవికాలం 2025 ఏప్రిల్ 7వ తేదీతో ముగియనుంది. దీంతో తదుపరి సీఎస్ ఎవరనే చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు సీనియర్ ఐఏఎస్?లు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రేసులో జయేశ్ రంజన్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, శశాంక్ గోయల్ తదితరులు ముందు వరుసలో ఉన్నారు. మరి వీరిలో ప్రభుత్వం ఎవరివైపు మొగ్గు చూపుతుంది అన్నది చూడాలి. 1989 బ్యాచ్కు చెందిన శాంతికుమారి బీఆర్ఎస్ హయాంలోనే సీఎస్గా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఆమె రికార్డు సృష్టించారు. 2023 జనవరి 11న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఈమె 2025 ఏప్రిల్ వరకు పదవిలో కొనసాగనున్నారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎస్ ను మార్చుతారన్న చర్చ నడిచింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయకుండా శాంతి కుమారినే ఆ పదవిలో కొనసాగించింది. ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ 1992 బ్యాచ్ కు చెందినవారు. ప్రస్తుతం ఈయన ఐటీ, ఇండస్ట్రీస్ స్పెషల్ సీఎస్గా కొనసాగుతున్నారు. ఆయనకు ఇంకా రెండున్నరేండ్ల సర్వీస్ ఉంది. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్ కు ఇంకా మూడేళ్ల సర్వీస్ ఉంది. ప్రస్తుతం ఈయన ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ఈయన సీఈవోగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల సీఎస్ శాంతి కుమారి సెలవుపై వెళితే.. వికాస్ రాజ్కే తాత్కాలిక బాధ్యతలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 1990 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ శశాంక్ గోయల్ కూడా సీఎస్ రేసులో ఉన్నారు. ఇప్పుడున్న ఐఏఎస్ల్లో అందరి కంటే ఆయనే సీనియర్. ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్డీ డీజీగా పనిచేస్తున్నారు. ఈయన రిటైర్ కావడానికి ఇంకా ఏడాదిన్నర టైమ్ మాత్రమే ఉంది. 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు ఈ ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఫైనాన్స్ స్పెషల్ సీఎస్గా ఈయన కొనసాగుతున్నారు.