TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
RATION CARD NOTIFICATION| eligible people will get ration cards
కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
కరీంనగర్-ప్రభాత సూర్యుడు
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా లబ్దిదారులకు కొత్త కార్డులు ఇచ్చారు. కార్డులును పొందిన వారందరికీ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అందుకు అవసరమైన కోటాను ఆయా జిల్లాలకు కేటాయించింది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 63 మండలాలు, 14 పురపాలికలు, రెండు నగర పాలక సంస్థలు గ్రామ, వార్డు సభలు నిర్వహించి జాబితాలో ఉన్నవారి పేర్లను చదివి వినిపించారు. ఆ తర్వాత గతనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంక్షేమ పథకాలను ప్రారంభించే లక్ష్యంతో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులుగా గుర్తించారు. ఉమ్మడి జిల్లాలోని 1,608 మందికి రేషన్ కార్డులు అందజేశారు. కొత్త కార్డుల్లో 9,663 యూనిట్లు (లబ్ధిదారులు) నమోదవగా ఈ నెల నుంచి వారికి బియ్యం పంపిణీ చేయనున్నారు.కొత్త కార్డుల్లోని లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు ఉమ్మడి జిల్లాకు ఈ నెలలో 54.751 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా పెరిగింది. మరోవైపు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హులైన మిగతా లబ్దిదారులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కొత్త రేషన్ కార్డుల కోసం నాలుగు జిల్లాల్లో కలిపి 1,01,103 దరఖాస్తులు వచ్చాయి. అర్హులను గుర్తించే ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి వచ్చే నెల నుంచి వారికి కూడా బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కరీంనగర్ సివిల్ సప్లై అధికారి నర్సింగరావు మాట్లాడుతూ గత నెలలో మండలాని ఒక గ్రామంలో పంపిణీ చేసిన రేషన్ కార్డుల్లోని లబ్దిదారులకు ఈ నెల నుంచే బియ్యం పంపిణీ జరుగుతుందని చెప్పారు. వచ్చే నెలకు కార్డులు, లబ్దిదారుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. రేషన్ కార్డుల జారీ, సభ్యుల పేర్లు చేర్చడం, అనర్హుల పేర్లు తొలగించడం నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికి రేషన్ కార్డులు వస్తాయని చెప్పారు. పాత రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు విూ`సేవ కేంద్రాల్లో వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నప్పటికి ఇంకా తమ లాగిన్లోకి రాలేదని, ఈ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే నూతన సభ్యుల పేర్లను చేర్చుతామని చెప్పారు.